Wednesday, 13 August 2014

విద్యుత్‌ పంపిణీ సంస్థల కోరికకు మించి చార్జీలు పెంచిన రెగ్యులేటరీ కమీషన్‌

    2012`13 సంవత్సరం వ్యవసాయరంగానికి విద్యుత్‌ చార్జీల పెంపుదలను కోరకుండా నాలుగు డిస్టిబ్యూటరీ కమిటీలు విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపాయి. బహిరంగ విచారణలో కూడా పెంపుదలను కోరలేదు. రెగ్యులేటరీ కమీషన్‌కు రైతు సంఘాల తరపున హాజరైనవారు సరఫరాలో జరగుతున్న లోపాలను, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణలో జరగుతున్న లోపాలను మరియు పంపుసెట్లకు విద్యుత్‌ సెట్లను మరింత మెరుగుపర్చాల్సిన విధానాలను అమలు జరిపించాలని రెగ్యులేటరీ కమిషన్‌ను కోరారు. కానీ కమీషన్‌ అవేమి పట్టించుకోకుండా, డిస్కాంలు కోరకున్నప్పటికీ విద్యుత్‌ చార్జీలను పెంచి రైతులపై భారాలు వేయడం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ పంపుసెట్ల విద్యుత్తు సరఫరాను రెండు ప్రధాన భాగాలుగా విడగొట్టారు. 1) డిమాండ్‌ సైడ్‌ మానేజ్‌మెంట్‌(ఐఎస్‌ఐ పంపుసెట్లు, పైపులు ఏర్పాటు చేసుకున్న రైతులు) 2) డిమాండ్‌ సైడ్‌ మానేజ్‌ మెంట్‌ అనుసరించనివారు వీరితోపాటు వ్యవసాయాధారిత కుటీర పరిశ్రమలు, ఉప్పు రైతులు, హార్టీ కల్చర్‌ నర్సరీలకు విడిగా టారిఫ్‌ రేట్లను నిర్ణయించారు. గతంలో సర్వీసు చార్జీ కింద నెలకు రు.20 ఉండగా 2011`12 నుండి రు.30కి పెంచారు. ప్రకృతివైపరీత్యాల వలన సర్వీసు చార్జీలు బకాయ పడిన రైతుల ఇంటి సరఫరాతోపాటు పంపుసెట్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. కొన్ని చోట్ల జప్తులు కూడా చేశారు. అవమానం భరించలేక అత్మహత్యలకు పాల్పడ్డారు. 
    మూడు పంపు సెట్లకు లోపు గల కనెక్షన్లు 27,33,239 కాగా, 2 ఎకరాలకు తక్కువ భూమి ఉన్న రైతులు 3,17,828 మంది పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ పొందుతారు. వీరు డిమాండ్‌సైడ్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని అనుసరిస్తేనే ఉచిత విద్యుత్‌కు అర్హులు.  డిమాండ్‌సైడ్‌ మేనేజ్‌మెంట్‌ అనుసరించినప్పటికీ న్నులు చెల్లించే కార్పోరేటు రైతులు యూనిట్‌కు రు.1.50 నుండి రు.2.50/`లు చెల్లించాలి. వీరు 8,671 మంది ఉన్నారు. మాగాణి 2.5 ఎకరాలకు పైబడిన రైతులు మరియు 3 పంపు సెట్ల కనెక్షన్లకు మించి ఉన్న రైతులు గతంలో యూనిట్‌కు 30 పైసలు చెల్లించగా నేడు 50పైసలకు పెంచారు. వీరు 26,345 మంది ఉన్నారు. లేదా హెచ్‌పికి సంవత్సరానికి 525 రూపాయలు చెల్లించాలి.
    డిమాండ్‌సైడ్‌మేనేజ్‌మెంట్‌ అమలుజరిపని రైతులు, కార్పోరేట్‌ రైతులు యూనిట్‌ రు.2.50 నుండి రు.3.50కు (3,199) 2.5 ఎకరాల మాగాణికి మించిన రైతులు మరియు 3 కనెక్షన్లకు మించిన రైతులు 75 పైసల నుండి రూపాయి వరకు చెల్లించాలి. వీరు 19,648 మంది ఉన్నారు. వీరుపై యూనిట్‌ ప్రకారం లేదా హెచ్‌పికి రూ.1050 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలి. మెట్ట ప్రాంతాలలో 2.5 ఎకరాలలోపు వారు, 3 పంపుసెట్లకన్నా తక్కువ ఉన్నవారు గతంలో యూనిట్‌కు 30పైసలు చెల్లించగా నేడు 50 పైసలు చెల్లించాలి. వీరు 2,298 మంది ఉన్నారు. డిమాండ్‌సైడ్‌మేనేజ్‌మెంట్‌ కింది ఈ దిగువ నిబంధనలున్నాయి.
1) ప్రతి పంపుకు ఐఎస్‌ఐ కెపాసిటర్‌ అమర్చాలి. పిక్షన్‌లెస్‌ పుట్‌వాల్వ్‌ పెట్టాలి. ఐఎస్‌ఐ పంపుసెట్టు ఉండాలి. పంపుసెట్టు కింద రెండో పంట వరి వేసినచో ఉచిత విద్యుత్‌ పథకం కిందికి రాదు. 7 గంటలకు మించి విద్యుత్‌ వినియోగించినచో యూనిట్‌కు రు.3.50లు చెల్లించాలి. ఈ విధంగా పంపుసెట్ల రైతులను విడదీసి చార్జీలు పెంచారు. అనంతపురం, చిత్తూరు, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఒకే రైతు 10,12 బోర్లు వేశారు. పండ్ల తోటలను రక్షించుకోవడానికి అప్పుతెచ్చి 4,5 పంపుసెట్లు అమర్చుకున్నారు. 3 పంపుసెట్లకు మించకూడదంటే వీరంతా ఉచిత విద్యుత్‌కు అనర్హులవుతున్నారు. నేడు రాష్ట్ర రైతులు 12 వేల కోట్లు రుణం తెచ్చి వ్యయం చేసి 29.60 లక్షల పంపుసెట్లు అమర్చుకున్నారు.వీటికింద 50 లక్షల ఎకరాలు సేద్యం కావాలి. కానీ 7 గంటలే విద్యుత్‌ సరఫరా చేయడం వలన 25 లక్షల ఎకరాలకు తగ్గింది. ఆ సరఫరా కూడా 3,4 సార్లు చేస్తున్నారు. నాణ్యత లేని విద్యుత్‌ సరఫరా వలన యేటా లక్షలాధి పంపుసెట్లు కాలిపోతున్నాయి. రిపేర్లకు రైతులు కోట్లాదిరూపాయలు చెల్లిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అనేక ట్రాన్స్‌ఫార్మర్లకు ఎ,బి స్విచ్చులు లేకపోవడం, ఎర్తింగ్‌ లేకపోవడం వలన షాక్‌కు గురై రైతులు మరణిస్తున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వందల్లో సంఖ్య ఉంది. రెగ్యులేటరీ కమీషన్‌ నిబంధనల ప్రకారం లక్షరూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కానీ ఈ యాక్సిడెంట్‌ మరణాలు న్యాయబద్దమైనవి కావని ఎక్స్‌గ్రేషియో చెల్లించడానికి డిస్కాంలు నిరాకరిస్తున్నాయి. వేలాది పసువులు విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోతున్నాయి. న్యాయమని తోస్తే రు.3000 ఎక్స్‌గ్రేషియో ఇస్తారు. ఈ రోజు సాధారణ పసువు ధర రు.15,000`25,000ల మధ్య కొనుగోలు జరుగుతున్నాయి.
    15 హెచ్‌పి వరకు ఉప్పు రైతులు(1294) గతంలో యూనిట్‌కు 1రూపాయి చెల్లిస్తుండగా ఇప్పుడు ప్రస్తుతం రు.2.12లకు పెంచారు. అదేవిధంగా గ్రామీణ హార్టీకల్చర్‌ నర్సరీరైతు(287)లకు కూడా 1రూపాయి నుండి రు.2.12లకు పెంచారు. కోళ్ళ పెంపకందారులు వెయ్యి కోళ్ళకుపైన పెంచినచో వారికి 1.80ల నుండి 2.67 పైసలకు పెంచారు. వ్యవసాయాధారిత కుటీర పరిశ్రమలకు కూడా 1.80ల నుండి 2.67లకు పెంచారు. ముఖ్యంగా లిప్టుల కింద ఉన్న రైతులకు భారీగా వడ్డించారు. గతంలో హైటెన్షన్‌ లిప్టుల కింద ఉన్న వారు. యూనిట్‌కు 2.60లు ఉండగా 3.25లకు పెంచారు. మొత్తంగాను చూస్తే 30 లక్షల మంది రైతులు ఉచిత విద్యుత్‌ నుండి మినహాయించబడ్డట్టు గణాంకాలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నది.
ప్రభుత్వ వాదన
    విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. 2003`04లో 34,445 మిలియన్‌ యూనిట్లు అమ్మగా 2012`13కు 79,462 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. అదేవిధంగా డిస్కాంలకు ఆదాయలోటు 2,032 కోట్ల నుండి 11,140 కోట్లకు పెరిగింది. అందువలన టారిఫ్‌ రేట్లు పెంచాల్సివచ్చింది. అదే సందర్భంలో ట్రాన్స్‌మిషన్‌ మరియు డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలు 22.30శాతం నష్టాలు కాగా 2010`11 నాటికి 16.73 శాతానికి తగ్గాయి. కానీ ఈ ప్రభుత్వం చెప్పే ఈ వాదనలో పసలేదు. సెంట్రల్‌ డిస్కాంలో ఒక హైదరాబాదులోనే 45 శాతం నష్టాలున్నట్లు శాంపిల్‌ సర్వేలు తెలుపుతున్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు లేకపోవడం వలన ఆ నష్టాలను వ్యవసాయంపైకి తోసి, తక్కువ నష్టాలు చూపుతున్నారు. ఒక సర్వే ప్రకారం వ్యవసాయ విద్యుత్‌ వినియోగం 2003`04లో 12,636 మిలియన్‌ యూనిట్లు కాగా 2012`13లో 19,976 మిలియన్‌ యూనిట్లు వినియోగం జరిగినట్లు డిస్కాంలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చెప్పినట్లు 29.60 లక్షల పంపుసెట్లు పనిచేయడం లేదు.పంపుసెట్ల కనెక్షన్లు పొందిన వారందరి జాబితాను డిస్కాంలు ప్రకటిస్తున్నాయి. 2000 సంవత్సరం నుండి రెగ్యులేటరీ కమిషన్‌తో వాస్తవంగా పనిచేయుచున్న పంపుసెట్ల గణాంకాలు డిస్కాంలచే సర్వే చేయించి నెట్‌లో పెట్టాలని కోరినప్పటికీ ఈ రోజుకు డిస్కాంలు ఆ పనిచేయడంలేదు. సరైన సమాచారం ఉంటే ఇంతకాలం తాము నష్టాలను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని భావిస్తున్నారు. భూమిలో పంటమార్పిడి వలన, ప్రాజెక్టులు రావడం వలన, వ్యవసాయభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వలన వ్యవసాయాలు విరమించుకొని వలసలు వెళ్ళడం వలన మరియు కాలిపోయిన పంపుసెట్టు రిపేరు చేసుకునే స్థోమత లేకపోవడం వలన కనీసం 8 లక్షల పంపుసెట్లు పనిలోలేవు. పైగా 7 గంటల విద్యుత్‌ సరఫరా లేకపోవడం వలన విద్యుత్‌ వినియోగం డిస్కాంలు ప్రకటించినంత లేదు. ఒక హెచ్‌పి పంపుసెట్టు పనిచేస్తే 746 యూనిట్లు వినియోగం అవుతుంది. 90 శాతం పంపుసెట్లు 5`7.5 హెచ్‌పిల వరకే ఉన్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు విడిగా పీడర్లు ఏర్పాటు చేసి ఖచ్చితంగా వ్యవసాయ వినియోగాన్ని లెక్కించవచ్చు. కానీ అందుకు డిస్కాంలు సిద్దంగా లేవు.
    డిమాండ్‌కు తగినట్లు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యం కొరవడిరది. గత 7 సంవత్సరాలలో 5,311 మెగావాట్ల స్థాపిత శక్తిని కలిపినప్పటికీ 2012 మార్చి నాటికి 16,400 మెగావాట్ల స్థాపిత శక్తి మాత్రమే ఉన్నది. డిమాండ్‌కు తగిన ఉత్పత్తిని పెంచాలన్న లక్ష్యంపై దూరదృష్టిలేని ప్రభుత్వ విధానాన్ని స్థాపన శక్తి రుజువు చేస్తున్నది. రాష్ట్రంలో విపరీతమైన గ్యాస్‌ లభ్యత ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారే తప్ప ఈ  రాష్ట్రంలో వినియోగించడంలేదు. ఇక్కడ లభ్యమవుతున్న గ్యాస్‌ను వినియోగించడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తే కాక ఎరువుల ఉత్పత్తితోపాటు వాహనాలకు డీజిల్‌, పెట్రోల్‌ను ఆదా చేయవచ్చు. శంకరంపల్లె(రంగారెడ్డి), కరీంనగర్‌జిల్లా దేవనూర్‌లో రెండు చోట్ల కలిపి 3500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటుకు మంజూరి ఇచ్చారు. కానీ వాటికి గ్యాస్‌ అలాట్‌మెంటు లేకపోవడంతో ఇంతవరకు ప్రాజెక్టుల పని ప్రారంభించబడలేదు. కానీ ప్రైవేటు కంపెనీలకు 33,695 మెగావాట్ల ఉత్పత్తికి 29 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే 18 వేల మెగావాట్ల ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయి. కానీ వేలాది ఎకరాల భూములు కేటాయించబడిన ఈ సంస్థలు ఆ భూములను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలకు వినియోగిస్తున్నాయే తప్ప విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాలు ప్రారంభించలేదు. ఉత్పత్తికి అవసరమయ్యే ఫియెల్‌ ధరలు పెరుగుదలను వినియోగదారులపై వేస్తున్నారు. గతంలో పియెల్‌ సర్‌చార్జీ కింద 3వేల కోట్లను వినియోగదారులపై వేయడానికి ప్రయత్నించగా కోర్టు ఆదేశంతో ప్రస్తుతం ఆ భారాన్ని పెండిరగులో పెట్టారు. ప్రైవేటు కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల అవకతవకల మూలంగా వారు ఉత్పత్తి చేయకున్నా స్థాపిత పెట్టుబడిపై(ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌) లాభాలు పొందుతున్నారు. అలాగే వేరియబుల్‌ క్యాపిటల్‌(ఫ్యూయెల్‌ చార్జీలు) పెంపుదలను అధికంగా చూపి లాభాలు దండుకుంటున్నారు.
    2012`13లో విద్యుత్‌ ఉత్పత్తి స్థాపిత శక్తిలో 75 శాతం(పిఎల్‌ఎఫ్‌) ఉంటుందని, జలవిద్యుత్‌ లభ్యత తక్కువ ఉంటుందని అంచనా వేసి లోటు ఎక్కువ చేసి యూనిట్‌కు రు.7పైన చెల్లించి బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి నిర్ణయించడం వలన ఈ భారాలు పెరిగాయి.
    ప్రభుత్వ రంగంలో విద్యుత్‌ శాఖ పనిచేసినపుడు డిమాండ్‌కు తగిన ఉత్పత్తి జరిగింది. కానీ సంస్కరణలు చేపట్టిన అనంతరం 2000 సంవత్సరం నుండి విద్యుత్‌ కోత(కొరత)తోపాటు ప్రైవేటు కంపెనీలు వేలకోట్ల రూపాయలు లాభాలు దండుకుంటున్నాయి. ఐనా తగినంత ఉత్పత్తి కావడంలేదు. తలసరి వినియోగం రాష్ట్రంలో సంవత్సరానికి 950 యూనిట్లు కాగా అభివృద్ధి చెందినదేశాలే కాక, చెందుతున్న దేశాలలో తలసరివాడకం 3వేల యూనిట్లకు పై ఉంది. చైనాలో 5వేల యూనిట్లు ఉంది. విద్యుత్‌ తలసరి వినియోగాన్ని బట్టి దేశాభివృద్ధిని అంచనా వేయవచ్చు. ప్రైవేటు రంగ ప్రవేశంతో కృత్రిమ కొరత సృష్టించి(ఉత్పత్తి వనరులున్నప్పటికీ) దేశాభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు. పాలకులు, ప్రైవేటు ఉత్పత్తిదారులకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఈ సంత్సరం లోటును పూడ్చడానికి 4,450 కోట్లు చార్జీలను పెంచడంతోపాటు రాష్ట్రప్రభుత్వం రూ.5,358.67 కోట్లు సబ్సిడీగా భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2008`09 నుండి రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలకు రు.16వేలకోట్లు బకాయిపడి ఉంది. ఈ బకాయి చెల్లించడంతోపాటు ఎపి కంపెనీకి యేటా 3 వేల కోట్లు ఈక్విటీగా చెల్లిస్తే కొరతను తీర్చే విధంగా ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హిమాలయా నదులలో హైడల్‌ ఉత్పత్తికి గల అవకాశాలను వినియోగించవచ్చు. కేంద్ర ఉత్పత్తి సంస్థల నుండి అదనపు కోటాను రాబట్టాలి. ఆ విధానాలు అమలు జరుపుట వలన చార్జీలు పెంచకుండానే వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా చేయవచ్చు.
 సారంపల్లి మల్లారెడ్డి
తేది.01.04.2012

No comments:

Post a Comment